- వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని అభ్యర్థన
- బయోడేటా బ్రోచర్ అందజేత
అక్షరశక్తి, హన్మకొండ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా రిజర్వుడ్ స్థానమైన వరంగల్ టికెట్ కోసం నేతలతోపాటు పలువురు అధికారులూ పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి టికెట్ రేసులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చే పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని రిజిస్ట్రార్ హరికోట్ల రవి కలిసారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ను తనకు కేటాయించాలని కోరుతూ.. బయోడేటా బ్రోచర్ను అందజేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తాను పాల్గొన్న ఉద్యమాలు, సామాజిక సేవాదృక్పథంతో నిర్వహించిన కార్యక్రమాలు, ఉద్యోగసంఘ నాయకుడిగా ఉద్యోగుల సమస్యలపై జరిపిన పోరాటాలు, కరోనా సమయంలో చేసిన సేవలు, అంబేద్కర్, పూలే విధానాలను ముందుకు తీసుకెళ్లడం, నిరుపేద దళిత కుటుంబం నుండి జిల్లా రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగిన పరిస్థితులను క్లుప్తంగా సోనియా గాంధీకి హరికోట్ల రవి వివరించినట్లు తెలుస్తోంది. జనంలోకి వెళ్లండి.. తమ ఆశీస్సులు ఉంటాయి.. అంటూ ఆమె భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సోనియాగాంధీని హరికోట్ల రవి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సోనియాగాంధీని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి
Must Read