అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మృతుడు వీరస్వామిది స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాదంలో గాయపడిన వీరస్వామి మృతిచెందడంతో కేటీపీపీలో విషాదం అలుముకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుడు సీతారాములు చికిత్స పొందుతున్నారు. హనుమకొండలోని అజార ఆస్పత్రిలో మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.