- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఆదరణ
- పార్టీలో చేరుతున్న విద్యావంతులు, యువకులు
- అవినీతి రహిత పాలన కోసం ఆప్ను ఆదరించండి
- పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్లపల్లి సురేష్
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకూ తన ఉనికి పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ వైపు జనం చూస్తున్నారు. కులమతాలకు అతీతంగా, అవినీతి రహిత ప్రజాపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అడుగుజాడల్లో నడిచేందుకు విద్యావంతులు, విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆప్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా పార్టీ విస్తరిందనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ సురేష్ తాళ్లపల్లి ఆధ్వర్యంలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ యువజన నాయకుడు దక్క సాయి తేజ, మీడియా ఇన్చార్జిగా సూర్ణపు సందీప్ నాయకత్వంలో యువ నాయకులు రోహిత్ , ధీరజ్ విశ్వ, హర్షిత్, శ్రీరామ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 61 వ డివిజన్ లో విద్యావంతులు ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు రాము, ప్రైవేట్ ఉద్యోగి రాజేష్, 5వ డివిజన్ నుంఇ శారీఫ్ ఉన్నిసా బేగం, మహిళలు, సామాజిక సేవా కార్యకర్తలు పార్టీలో చేరారు. ఢిల్లీలో పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి పనులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి కార్యక్రమాలకు ఆకర్షితులమై తాము చేరుతున్నట్లు యువకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తాళ్లపల్లి సురేష్ మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోడల్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా తెస్తామని, విద్యావంతులు, యువకులు, జనం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మజాదేవి, ఉపాధ్యక్షరాలు విజయ లక్మి, ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షరాలు గూడూరు మాచాల, వరంగల్ తూర్పు ఇన్చార్జి ప్రొఫెసర్ బూర ముత్తి లింగం, హన్మకొండ జిల్లా యువజన నాయకుడు మేడిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.