- ఎంపీ టికెట్ మహిళకే…?
- ఎంపీ ఆనంద్కుమార్ సతీమణి బొడ్డు సునీతకు ఛాన్స్?
- చివరినిమిషంలో అనూహ్య పరిణామాలు
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ టికెట్ కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలతో ఆశావహులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు కీలక నేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. తాజాగా, అందుతున్నసమాచారం మేరకు కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 17 సీట్లలో రెండు లేదా మూడు సీట్లను మహిళలకు కేటాయించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ కూడా ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ ఆనంద్కుమార్ సతీమణి బొడ్డు సునీత పేరు టాప్లో ఉన్నట్లు సమాచారం. దాదాపుగా నాలుగు దశాబ్దాలకుపైగా పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగుతూ.. పార్టీ కుటుంబంగా గుర్తింపు పొందిన ఎంపీ ఆనంద్కుమార్ సతీమణికే టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, కొద్దిపాటి తేడాతో ఓటమిపాలైన ఇందిర కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
టికెట్ కోసం పోటాపోటీ…
ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ టికెట్ కోసంకాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి తీవ్రపోటీ నెలకొంది. మాల, మాదిగ సామాజికవర్గాలకు చెందిన పలువురు నాయకులు, అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన దొమ్మటి సాంబయ్య, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, అడిషనల్ డీసీపీ శోభన్కుమార్, ఇందిర, ఎంపీ ఆనంద్కుమార్ సతీమణి బొడ్డు సునీత, బక్క జడ్సన్ తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. ఇక మాల సామాజికవర్గానికి చెందిన అద్దంకి దయాకర్, వరంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురాసి ప్రసాద్రాజు, వరంగల్ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, బందెల రాజభద్రయ్యతోపాటు తదితరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వరంగల్ టికెట్ను మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన పార్టీ అధిష్ఠానం.. దొమ్మటి సాంబయ్య వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయనకు అందిన సానుకూల సంకేతాలతో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు వరంగల్ టికెట్ను మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళకు టికెట్ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇందులో ఎంపీ ఆనంద్కుమార్ సతీమణి బొడ్డు సునీత పేరు టాప్లో ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఢిల్లీలో మంగళవారం సాయంత్రం జరుగుతున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా పార్టీలో…
హన్మకొండలో సెయింట్ పాల్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ నిర్వాహకులుగా ఉన్న ఎంపీ ఆనంద్కుమార్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో అనేక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన సతీమణి బొడ్డు సునీత ప్రస్తుతం హన్మకొండలోని సెయింట్ పాల్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రన్సిపాల్గా కొనసాగుతున్నారు. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్ఎస్యూఐలోనూ పనిచేశారు. అనంతరం పార్టీలో కొనసాగుతున్న ఆమె.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్రెడ్డి గెలుపులోనూ కీలకంగా వ్యవహరించారు. వార్ రూమ్ ఇన్చార్జిగాను ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను వరంగల్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. నిజానికి, మొదట ఎంపీ ఆనంద్కుమార్ టికెట్ కోసం ప్రయత్నించగా.. కొందరు పార్టీ పెద్దల సూచనలు, పలు సమీకరణాల నేపథ్యంలో ఆయన సతీమణి బొడ్డు సునీతను టికెట్ రేసులో నిలిపినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈరోజు రాత్రి లేదా బుధవారం ఉదయం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉండడంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.