- దేవరుప్పులలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
- బండి సంజయ్ మాట్లాడుతుండగా మొదలైన లొల్లి
- ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ
- పలువురికి గాయాలు
- డీజీపీతో ఫోన్లో మాట్లాడిన సంజయ్
- పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
అక్షరశక్తి, జనగామ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో లొల్లి జరిగింది. దేవరుప్పుల మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లు, కర్రలతో పరస్పరం తీవ్ర స్థాయిలో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని శాతింపజేయడానికి ప్రయత్నించారు. అనంతరం అక్కడి నుంచి యాత్ర పాలకుర్తి వైపుగా సాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంగ్రాయ యాత్ర 13వ రోజు సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కేంద్రంలో కొనసాగింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సంజయ్ మాట్లాడుతుండగా లొల్లి మొదలైంది. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సంజయ్ అనగా.. అక్కడే ఉన్న ఓ టీఆర్ఎస్ కార్యకర్త వెంటనే స్పందిస్తూ.. ముందుగా మోడీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరస్పరం దూసుకొచ్చారు. రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం
ఈ ఘటన నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే డీజీపీకి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోవాలని అన్నారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? కేసీఆర్ ఉండేది ఇంకో ఆరు నెలలే… తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండి.. అంటూ బండి సంజయ్ అన్నారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వెంటనే స్పందించాల్సిందే… లేనిపక్షంలో గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని మీవద్దకొస్తా.. అంటూ డీజీపీకి బండి సంజయ్ డెడ్లైన్ పెట్టారు. అనంతరం బైరాన్ పల్లి పోరాట యోధులు, వారి వారసులను బండి సంజయ్ సన్మానించారు.