పలు ఉత్పత్తుల నకిలీ బాటిళ్లు స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్టు
అక్షరశక్తి, హన్మకొండ : వివిధ కంపెనీలకు సంబంధించిన వస్తువుల పేర్లతో నకిలీ వస్తువులు తయారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.ప్రేమానందం వివరాలను వెల్లడించారు. నకిలీ వస్తువులైన బూస్ట్, సర్ఫ్ ఎక్సెల్, మస్కిటో రిపెల్లెంట్స్పై వివిధ కంపెనీల స్టిక్కర్ల అతికించి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది.
నిందితుల వివరాలు
1. కతిరియా అవినాష్ ( తండ్రి శాంతిలాల్, వయస్సు 36, ఫీల్ కాలనీ, హైదరాబాద్), 2. వజ్రపు నరసింహ మూర్తి ( తండ్రి రమణారావు, వయస్సు 33, బ్రాహ్మణ వీధి హన్మకొండ, 3. యెనగంటి రాకేష్ ( తండ్రి రాజేష్, వయస్సు 37, గోపాలస్వామి దేవాలయం, వరంగల్ సుందరయ్యనగర్) లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా హైదరాబాద్కు చెందిన ముఠాతో కలిసి హైదరాబాద్లో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి, వాటికి కంపెనీల స్టిక్కర్లను అతికింది గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పంపిణీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి మారుతీ వ్యాన్, మూడు మొబైల్ ఫోన్లతో పాటు రూ.1,56,313 విలువైన నకిలీ ఉత్పత్తులు బూస్ట్ జాడీలు, సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు, దోమల నివారణ లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ సంబంధిత కంపెనీలు తమ ఉత్పత్తుల వాస్తవికతకు సంబంధించిన సమాచారాన్ని వార్తాపత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని, తద్వారా ప్రజలు నిజమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందన్నారు. కాపీరైట్ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని తెలిపారు.