హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని, భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది.
కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ హైకోర్టుకు వెల్లడించారు. అయితే.. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులపై విచారణ ఈనెల 25కు కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. హైకోర్టులో రేపటి నుంచి వర్చువల్గా కేసుల విచారణ జరపనున్నారు. ఆన్లైన్లోనే పూర్తిస్థాయి విచారణలు హైకోర్టు చేపట్టనుంది.