అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో శుక్రవారం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అర్ధరాత్రి వేళ కాకతీయ యూనివర్సిటీ పోలీసులు యూనివర్సిటీలో చొరబడి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. బీసీ విద్యార్థి సంఘం ఇన్చార్జి అరెగంటి నాగరాజు గౌడ్, ఏబీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి చెల్పూరి శ్రీకాంత్, టీజీవీపీ నాయకులు రంజిత్, బీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా నాయకులు కడపక రాజేందర్, ఏబీవీపీ నాయకులు నిమ్మల రాజేష్, అంబాల కిరణ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కేయూ విద్యార్థి నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ప్రజలు నిరుద్యోగులు యువకులు రైతులు అడ్డుకోరని అనుకోవడం బుద్దితక్కువ పని అని అన్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ, , లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు చేయడంలో కేసీఆర్ కుటుంబం అరితేరిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తోందని ప్రశ్నించారు. బీసీలకు బీసీబంధు ఎప్పుడు ఇస్తారని, బీసీ భవనం ఎప్పుడు నిర్మిస్తారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 125 అడుగుల విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ల నియామకాలు ఎప్పుడు చేపడతారని ప్రశ్నించారు.