అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట రైల్వేలో ఈఎల్ఎస్(ఎలక్ట్రిక్ లోకో షెడ్)లో పని చేస్తూ సస్పెన్షన్కు గురైన పీ రవికుమార్ అనే ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పీ రవికుమార్ కాజీపేట రైల్వే ఈఎల్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్లోనే తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. పదేళ్లుగా పనిచేస్తున్న ఆయన ఇటీవల ఆయన సస్పెన్షకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన యూనిఫాం ధరించి షెడ్డులోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. తన చావుకు కారణమంటూ ఇద్దరి రైల్వే ఉద్యోగుల పేర్లను కూడా సూసైడ్లోని ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్డడమే కాకుండా, తనపై పై అధికారులకు ఫిర్యాదులు చేసి తనను సస్పెన్షన్ చేయించారని ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. విషయం తెలిసిన వెంటనే కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్, సీఐ రాజు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే, న్యాయం జరిగేలా చూస్తానని ఏసీపీ డేవిడ్రాజ్ హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.