- నియోజకవర్గవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
- ఐదేండ్ల అభివృద్ధికి జైకొడుతున్న జనం..
- మరోమారు గెలిపిస్తామంటూ స్వచ్చందంగా ముందుకు..
- ఉద్యమకారుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రత్యేక గుర్తింపు
- వందల కోట్లతో అభివృద్ధి పనులు
- ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం
అక్షరశక్తి, వరంగల్: నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ధి సుదర్శన్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఐదేండ్లలో పరుగులు పెట్టించిన పెద్ది.. ఈసారి గెలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తుంది. అందుకే ఊరూరా పెద్ది ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గంలో నిధుల వరద పారించిన పెద్ది.. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గోదావరి జలాలను రప్పించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంచేశారు. నర్సంపేటను ఎడ్యుకేషన్, హెల్త్ హబ్గా తీర్చిదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఉద్యమకారుడిగానే గాక అనతికాలంలోనే నర్సంపేట అభివృద్ధి ప్రదాతగా నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఐదేండ్లలో తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమాతో ముందుకుసాగుతున్నారు.
ఒకే ఒక్కడు..
2001లో పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన అతికొద్ది మందిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల నియంతృత్వాన్ని ప్రతిఘటించడంలో సుదర్శన్ రెడ్డి ముందున్నారు. అప్పటి టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. అరెస్టులు, రైలు రోకోల్లో పాల్గొని పలుమార్లు జైలు జీవితం అను భవించారు. ఉద్యమ సమయంలో పోలీసుల దెబ్బలకు కుడి కన్నుచూపును కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని కల్లారా చూసిన ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ నాయకులే కాదు ప్రజలు సైతం పార్టీలకు, సం ఘాలకు అతీతంగా వ్యక్తిగతంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అభిమానులుగా ఉన్నారు. ఈ అంశాలే ఈ ఎన్నికల్లో నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి పూర్తిస్థాయిలో అనుకూలంగా మారనున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
గెలిస్తే మంత్రి పదవి..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులుగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక గుర్తిపు ఉంది. సీఎం కేసీఆర్కు వీరిద్దరూ అత్యంత సన్నిహితులుగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. అందుకే 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీచేసి ఓడిపోయినప్పటికీ పెద్ది సుదర్ర్శన్రెడ్డికి మొదటి తెలంగాణ ప్రభుత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని సీఎం కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, పలు సామాజిక సమీకరణాల నేపథ్యంలో చేజారింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఆ కోటాలో పెద్ది సుదర్శన్ రెడ్డికి జిల్లా నుంచి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకుంటే తమకు అభివృద్ధి ఫలాలు అందుతాయనే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లు అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
55 ఏళ్లుగా కాంగ్రెస్ గెలిచిందే లేదు..
నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 1967లో కాంగ్రెస్ పార్టీ నుండి కే సుదర్శన్ రెడ్డి గెలిచిందే ఈ నియోజకవర్గంలో ఆఖరి విజయం. 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు. 2014లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి కత్తి వెంకటస్వామికి అతి దారుణంగా 6,638 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఐదేళ్లుగా నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధితో అన్ని మండ లాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో నియోజకవర్గవ్యాప్తంగా నర్సంపేట పెద్దిదే అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.