Saturday, July 27, 2024

వరంగల్ పశ్చిమ బరిలో అయిలాపురం వేణుచారి

Must Read
  • తెలంగాణ ద్ర‌విడ ప్ర‌జ‌ల పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ..
  • ప‌లు కుల‌, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు..
  • వీకే హెల్పింగ్ సొసైటీ ద్వారా ద‌శాబ్ధ‌కాలంగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: డబ్బు, మద్యం, కులం చుట్టే తిరుగుతున్నాయి ప్ర‌స్తుతం ఎన్నికలు. ఎంత పేరున్నా, ఏస్థాయి నాయ‌కుడైనా పైస‌లు పంచకుండా, మ‌ద్యం పోయ‌కుండా గెలిచే ప‌రిస్థితిలేదు. కోటీశ్వరులైతేనే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న భావ‌న సమాజంలో బ‌లంగా నాటుకుపోయింది. అందుకే నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ప్ప‌టికీ అనేక‌మంది ఎన్నిక‌లకు భ‌య‌ప‌డి పోటీకి దిగే సాహ‌సం చేయ‌డంలేదు. కానీ, ఆయ‌న మాత్రం అంద‌రిలాంటి వారు కాదు.. మార్పు ఎక్కడి నుంచో రాదు.. అది మ‌న నుంచే మొద‌ల‌వ్వాలి అని బ‌లంగా న‌మ్ముతారు. స‌మాజంప‌ట్ల బాధ్య‌తగా ఉంటారు. ఆప‌ద‌లో ఉన్న‌వాళ్ల‌కు అండ‌గా నిలుస్తారు. స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాడు.. నిలదీస్తాడు. మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు క‌దులుతారు అయిలాపురం వేణుచారి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే ధ్యేయమం టూ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంతోపాటు విద్య, వైద్యాన్ని ఉచితం గా కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు కృషిచేస్తాన‌ని అంటున్నారు. వీకే హెల్పింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ద‌శాబ్ధ‌కాలంగా అనేక మందికి చేయూత‌నందించిన వేణుచారి.. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ తరఫున వ‌రంగ‌ల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

జ‌యశంక‌ర్ సార్ స్ఫూర్తితో..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అయిలాపురం వేణుచారి క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు యువతను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా తనవంతు పాత్ర పోషించారు. ఉన్నత విద్యావం తుడు కావడంతో తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే తమ బతుకులు బాగుపడతాయని నినదించారు. ఈక్ర‌మంలోనే స‌మాజానికి త‌న‌వంతుగా ఏదైనా చేయాల‌న్న ఆలోచ‌న‌తో వీకే యూత్ హెల్పింగ్ సొసైటీ ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్న వేణుచారి.. ద‌శాబ్ధ‌కాలంగా అనేక మందికి సంస్థ ద్వారా చేయూత‌న‌దించారు. క‌ష్టాల్లో ఉన్న వాళ్ల‌ను అక్కున చేర్చుకుంటూ, ఆర్థిక‌సాయం అంది స్తున్నారు. ఈక్ర‌మంలోనే వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత 54వ డివిజన్ అప్పుడు 44వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బెదిరింపులకు గురి చేసినా, ప్రలోభాల ఆశ చూపినా తలొగ్గకుండా బరిలో నిలిచారు. గౌరవప్రదమైన ఓట్లను సాధించారు. కరోనా స‌మ‌యంలో వ‌రంగ‌ల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

యువతకు స్ఫూర్తిగా..

ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూప‌ని యువతకు వేణుచారి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎన్నికలంటే భయపడవద్దని.. యువత రాజకీయాల్లోకి రావడం ద్వారానే మెరుగైన స‌మాజం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొంటున్నారు. మార్పు మ‌న నుంచే మొద‌లు కావాల‌ని బ్ర‌ష్టుప‌ట్టిన రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు యువ‌కులు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. కాగా, తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ వ‌రంగ‌ల్ పశ్చిమ అభ్యర్థిగా బరిలో నిలిచిన అయిలాపురం వేణుచారికి ఎన్నికల సంఘం క్రికెట్ బ్యాట్ గుర్తు కేటాయించింది. గ‌త కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కార్పొరేట‌ర్‌గా పోటీచేసినప్ప‌డు బ్యాట్ గుర్తే వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అదే గుర్తును ఎన్నికల సంఘం కేటాయించ‌డంతో ప‌లు కుల‌, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో వేణుచారి ప్ర‌చారం చేప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యేగా త‌న‌ను గెలిపిస్తే… నాయ‌కుడిగా కాదు, సేవ‌కుడిగా ఉంటాన‌ని, అభివృద్ధి చేసి చూపుతాన‌ని వేణుచారి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img