- ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా బరిలోకి..
- నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
- ఆరేండ్లుగా దళిత శక్తి ప్రోగ్రాంలో క్రియాశీలక పాత్ర..
- విశారదన్ మహారాజ్ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ..
- ఉన్నత విద్యావంతురాలిగా గుర్తింపు
- దళిత, బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా అడుగులు
అక్షరశక్తి, హన్మకొండ : ధర్మ యుద్ధానికి సిద్ధమయ్యారు కోగిల రూప. మన ఓటు – మన ప్రభుత్వం అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అణగారిన వర్గాల సమస్యల విముక్తికి పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల మార్గమే శరణ్యమని ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్నారు. ఆరేండ్లుగా దళిత శక్తి ప్రోగ్రాంలో కీలక భూమిక పోషించిన రూప రాజకీయాల్లో అడుగుపెట్టి, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ స్ఫూర్తితో ఎన్నికల బరిలోకి దిగారు. వరంగల్ పశ్చిమ నియోజవకర్గం నుంచి డీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుం టున్నారు, ఆలోచింపజేస్తున్నారు. ప్రజా ప్రాతినిథ్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆయా సామాజికవర్గాలు ఎంత శాతం ఉంటే ఆ మేరకు వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలని నినదిస్తున్నా రు. అప్పుడే దళిత, బహుజనులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతామని అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్నీ ఒక్కతాను ముక్కలేనని, మార్పుకోసం, మెరుగైన సమాజం కోసం, అవినీతి రహిత పాలన కోసం ధర్మ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. టార్చ్లైట్ గుర్తుకు ఓటేసి రాజకీయాల్లోని అంధకారాన్ని తొలగించాలని, సరికొత్త వెలుగుకు స్వాగతం పలకాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
దళిత శక్తి ప్రోగ్రాంలో కీలకపాత్ర..
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడెపాకకు చెందిన కోగిల రూప విద్యార్థి దశ నుంచే అభ్యదయ భావాలు కలిగి ఉన్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన ఆమె విశారదన్ మహారాజ్ స్ఫూర్తితో ఆరేండ్లుగా దళిత శక్తి ప్రోగ్రాంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దళిత శక్తి ప్రోగ్రాం కాస్త ధర్మ సమాజ్ పార్టీగా అవతరించిన తర్వాత ఆపార్టీలో చేరారు. తల్లిదండ్రులు, భర్త అనిల్ ప్రోత్సాహంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి డీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు కదులుతున్నారు. దళిత, బహుజనులకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. టార్చ్లైట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ధర్మమమనే ఆయుధంతో అధర్మం మీద యుద్దం చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
బహుజన రాజ్యమే లక్ష్యంగా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) సిద్దమైంది. కాన్షీరాం పోరాట మార్గాన్ని ఎంచుకొని సామాజిక, సాంస్కృతిక ఉద్యమం చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్సీల రాజస్థాపనకు కృషి చేస్తున్న ఆపార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ నుంచి 102 మంది అభ్యర్థులను పోటీకి దింపారు. పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఉన్నత విద్యావంతులకే ఆయన టికెట్లు కేటాయించారు. ఈక్రమంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతురాలైన కోగిల రూపకు అవకాశం కల్పించారు. సమస్యలపై లోతైన అవగాహన, సామాజిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన రూపను ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా పోటీకి దింపారు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు కోగిల రూప.