అక్షరశక్తి, హైదరాబాద్: సుప్రీం కోర్టు న్యాయవాది పూసాల శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ (టీడీపీపీ) రాజ్యాంగాన్ని పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అడ్వొకేట్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలింగన్నగారి భిక్షపతి ఆవిష్కరించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ ద్రవిడ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి గౌతమ్ విడుదల చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పద్మజతోపాటు పలువురు ప్రముఖులు, పార్టీ సభ్యులు హాజరయ్యారు. స్వరాష్ట్రం.. స్వయం ప్రతిపత్తి నినాదంతో పురుడు పోసుకున్న టీడీపీపీ తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్చారి వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దిగగా, వరంగల్ పశ్చిమ నుంచి వీకే హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ యూత్ ఫెడరేషణ్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిలాపురం వేణుచారి పోటీ చేస్తున్నారు.