- తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
- మీరు ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే గండ్ర మంత్రి కావొచ్చు..
- మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే గౌడ
- శాయంపేట మండలంలో ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావును ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కర్ణాటక రాష్ట్రం మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే గౌడ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, సామాన్య, పేద ప్రజల కోసం పనిచేసే గండ్ర సత్యనారాయణ రావుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని అన్నారు. గండ్రను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తనకు అదృష్టం కలిసివస్తే మంత్రి అవుతారని అన్నారు. గండ్ర సత్యనారాయణ రావు రెండుసార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయారని, అయినా ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్నారని, ఈసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం సాధనపల్లి గ్రామంలో జీఎస్ఆర్ చేపట్టిన ప్రజా దీవన యాత్రలో కర్ణాటక రాష్ట్రం మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే గౌడ పాల్గొన్నారు. ఓటర్లను కలిసి ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలు కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. తెలంగాణలో, దేశంలో కూడా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న సత్యనారాయణ రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు… మీ ఆశీర్వాదం, అదృష్టం ఉంటే మంత్రి కూడా అవుతారని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.
కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ ఎత్తున 200 మంది కాంగ్రెస్ లో చేరారు. చిట్యాల మండలం రాంనగర్ గ్రామం నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్లపల్లి నవీన్, కట్కూరి సుమన్, ఆరెపల్లి రమణ, కట్కూరి నవీన్, ఈర రాజు, కవ్వపెళ్లి శ్రీను, జంజిరాళ్ల కుమార్ తోపాటు
వీసీకే పార్టీ జనరల్ సెక్రటరీ శనిగరపు మహేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా చల్లగరిగే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ చెందిన సీనియర్ నాయకులు సిరిపల్లి జంపయ్య, వడ్నాల పర్వతాలు, సల్ల సమ్మిరెడ్డి, చర్లపల్లి దేవేందర్, ఏరువ మహేష్, పోతుగాటి దేవేందర్ గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాకుండా వీరితోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 మంది యువత హస్తం పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పతనం మొదలైంది
రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం మొదలైందని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. మేనిఫెస్టో తెలిపిన విధంగా ఆరు సూత్రాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ ఐత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గాజర్ల అశోక్, గణపురం ఎంపీపీ కావటి రజిత రవి, పీఏసీఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, వివిధ మండలకాంగ్రెస్ నాయకులు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు జవహర్ నగర్ కాలనీ, 8వ వార్డు, 27వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో వివిధ వార్డుల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు, ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అర్బన్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా నాయకులు, జవహర్ నగర్ కాలనీ యువకులు, నాయకులు పాల్గొన్నారు.