అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 23న కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్కు చేరిందని, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికిపైగా వెళ్లిందని, ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు. మూడో వేవ్ ఇక ముగిసిపోయినట్లేనని వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై డీహెచ్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కరోనా మొదటి వేవ్ వల్ల దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డామని , సెకండ్ వేవ్ దాదాపు ఆరు నెలలు ఉందన్నారు. మూడో వేవ్ 28 రోజుల్లోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయన్నారు. తెలంగాణ కొవిడ్ ని సమర్ధంగా ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణలో నిర్వహించిన ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు వచ్చాయని, కొవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవు
కరోనా థర్డ్ వేవ్ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని డీహెచ్ తెలిపారు. మూడో వేవ్ లో టీకా తీసుకొని వారు 2.8% మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. 31 లక్షల నిర్ధారణ పరీక్షలు చేసామమన్నారు. మూడో వేవ్లో జనవరి 25న అత్యధికంగా 4800 కేసులు నమోదు కాగా, కేవలం 3000 మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారన్నారు. ఫీవర్ సర్వేలో 4 లక్షల మందికి కరోనా కిట్లు అందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని, అన్ని సంస్థలు 100% పని చేయొచ్చని తెలిపారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చని డీహెచ్ తెలిపారు. ఐటీ ఇండస్ట్రీ సైతం వర్క్ ఫ్రొం హోమ్ తీసివేయవచ్చన్నారు. వర్క్ ఫ్రొం హోమ్ ని విరమించాలని కోరుతున్నామమని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. సాధారణ ఫ్లూ లా కొవిడ్ ..
విద్యా సంస్థలు పూర్తిగా ప్రారంభించామమని, పిల్లలలో ఆన్లైన్ తరగతులతో మనసిక సమస్యలు తలెత్తాయని డీహెచ్ పేర్కొన్నారు. కేసులు తగ్గినా మాస్క్ లు ధరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని డీహెచ్ కోరారు. మేడారం జాతరకు ప్రత్యక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్ కలిగిన ఆసుపత్రిని సిద్ధం చేశామన్నారు. అవసరమైన టెస్ట్ లు అక్కడే చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా టీకాలు వేశామన్నారు. 82శాతం మందికి రెండు డోస్ ల టీకా వేయడం జరిగిందన్నారు. టీనేజర్ లకు 73శాతం మందికి తొలి డోస్ , 13శాతం మందికి రెండు డోస్ లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలో నిజామాబాద్, ఆసిఫాబాద్ మినహా అంతటా 100 శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వచ్చే కొద్ది నెలల పాటు కొత్త వేరియెంట్ పుట్టే అవకాశం లేదన్నారు. త్వరలో కొవిడ్ ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూ లా కొవిడ్ మారుతుందని డీహెచ్ వివరించారు.