- భూ సేకరణకు వ్యతిరేకంగా పది రోజులుగా అన్నదాతల ఆందోళనలు
- రైతుల ఉద్యమంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- ల్యాండ్ పూలింగ్ రద్దు చేసిన కుడా
- త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన
అక్షరశక్తి, వరంగల్ ప్రధాన ప్రతినిధి : రైతుల పోరాటం ఫలించింది. అన్నదాతల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్పై ప్రభుత్వం వెనక్కితగ్గింది. ప్రాణం పోయినా తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని బాధిత రైతులు తెగేసి చెప్పడంతోపాటు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా పదిరోజులుగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పునారాలోచనలో పడిన ప్రభుత్వం ల్యాండ్పూలింగ్ను రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం పలువురు ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్.. బాధిత రైతులతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ల్యాండ్ పూలింగ్ను ఆపివేస్తామని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ప్రకటించారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నష్టపోతామనే ఆలోచనతోనే..
హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఔటర్రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510.02 ఎకరాల భూమి సమీకరణకు కుడా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. తమకు తెలియకుండా రహస్యంగా సర్వే చేయడంపై, ఎలాంటి సమాచారం లే కుండానే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్లో తమ భూముల సర్వే నంబర్లు వేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. తమ పొట్టమీద కొట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఐదు నియోజకవర్గాల పరిధిలోని 27 గ్రామాల రైతుల నుంచి, కూలీల నుంచి, మేధావుల నుంచి ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.