Saturday, July 27, 2024

లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

Must Read

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్‌పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షల‌కు పాల్పడుతూ అవసరమైన వారికి గర్భస్రావాలు చేస్తున్న ము ఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు, కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగ నిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్‌ఫోన్లు, రూ. 73 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బల్నె పార్ధు, డాక్ట‌ర్ మోరం అరవింద, డాక్ట‌ర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్ట‌ర్ బాల్నె పూర్ణిమ, బాల్నె ప్రదీప్ రెడ్డి. కైత రాజు, తల్లా అర్జున్, ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వివరాలను వెల్లడించారు.

గ‌తంలో అరెస్ట్ అయిన‌ప్ప‌టికీ..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగనిర్ధారణకు పాల్పడుతూ పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోని ఆడపిల్ల అయితే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్‌ఫోర్స్‌, జిల్లా వైద్య విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆపరేషన్ డేకాయ్ నిర్వహించి అక్రమంగా లింగనిర్ధారణ పాల్పడుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియ‌న్‌గా పనిచేసి అనుభవం వుండటంతో పాటు, గతంలో అక్రంగా లింగనిర్ధారణ పాల్పడటంతో హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరోమారు ప్రవీణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం తన భార్య సంధ్యారాణితో కల్సి కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని గర్భవతులకు లింగనిర్ధారణ చేసేందుకు కొద్ది సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల సహాయంతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నాడు.

వందకుపైగా గర్భస్రావాలు..

నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్.యం. పిలు, పి.ఆర్.ఓలు, హాస్పటల్ మెనేజ్మెంట్, సిబ్బంది డాక్టర్లతో కల్సి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. తాను రహస్యంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్ లింగ నిర్ధారణకు వచ్చే మహిళలకు పరీక్షలు నిర్వహించి, పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోని ఆడపిల్ల అయితే గర్భస్రావం కోసం ఈ ముఠాకు చెందిన హాస్పటల్స్ కు పంపేవాడు. హనుకొండలోని లోటస్ హాస్పటల్, గాయత్రి హాస్పటల్, నెక్కొండలోని ఉపేందర్ (పార్టు) హాస్పటల్, నర్సంపేట్లోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హాస్పటల్ నందు అక్రమంగా గర్భస్రావాలను చేసేవారు. ఇందుకోసం బాధితుల నుండి ఫీజుల రూపంలో వసూళ్ళ చేసిన డబ్బులను ఈ ముఠా సభ్యులు కమీషన్ల రూపంలో వాటాలు పంచుకునేవారు. ఒక్కోక్క గర్భస్రావానికి రూ. 20 వేల నుండి 30 వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసేవారు. ఇప్పటి వరకు ఈ ముఠా వందకుపైగా గర్భస్రావాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ పుష్పా, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్ట‌ర్లు సుజాత, శ్రీనివాసరావు, జనార్ధన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్సైలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్ త‌దిత‌రుల‌ను సీపీ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img