రేపు సికింద్రాబాద్ స్టేషన్లో వందేభారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని
ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రె్సను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వేదికగా సికింద్రాబాద్-మహబూబ్నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. రూ.720 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బొల్లారం-మేడ్చల్, ఫలక్నుమా-ఉందానగర్ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అదే వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గురువారం పోలీసు ఉన్నతాధికారులు, ప్రధాని భద్రతా సిబ్బంది, ఆయా విభాగాల అధికారులు పరేడ్ గ్రౌండ్స్లో వేదికలను పరిశీలించారు. వీవీవీఐపీ, వీఐపీ, మీడియా, సాధారణ ప్రజానీకానికి ఏర్పాటు చేసిన వేర్వేరు గ్యాలరీలను తనిఖీ చేశారు. ప్రధాని పర్యటనలో భాగస్వాములయ్యే అధికారులకు కొవిడ్ పరీక్షలను తప్పనిసరి చేశారు. కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
వందేభారత్కు నాలుగు స్టేషన్లలో హాల్టింగ్
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు 20701, తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు 20702 నంబర్లను కేటాయించారు. సికింద్రాబాద్- తిరుపతి రైలు మార్గ మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. తొలిరోజు ప్రారంభోత్సవం సందర్భంగా 11 స్టేషన్లలో 5 నిమిషాల చొప్పున వందేభారత్ రైలు ఆగనుంది.