అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కారు డ్రైవరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు కమ్మంబాటి శ్రీను, రమేష్ తమ భార్యలతో కలిసి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో గట్టమ్మ ఆలయ సమీపంలో కారు, హన్మకొండకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కమ్మంపాటి రమేష్, అయన భార్య జ్యోతి, కంభంపాటి శ్రీను ఆయన భార్య సుజాత, వాజేడు మండలం చండ్రుపట్లకు చెందిన డ్రైవర్ బుద్దె కళ్యాణ్ మృతి చెందారు. ప్రస్తుతం మృదేహాలను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గట్టమ్మ వద్ద ట్రాఫిక్ జామ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.