ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ తెలిపింది. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా హాజరు కావాలని పేర్కొంది. రెండు రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఎ న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేర్చింది. ఈ పరిణామం చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే సీబీఐ నుంచి క ల్వకుంట్ల కవితకు నోటీసులు ఇష్యూ కావడం గమనార్హం. ఈక్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాతే ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్ లింకులు బయటపడినప్పుడే కవిత పేరు లీకయింది. తాజాగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఆమె పేరును పేర్కొనడంతో మరోసారి కవిత టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. మద్యం వ్యాపారులను ఒక్కటి చేసి ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు కవిత వందల కోట్ల ముడుపులు అందించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరికొందరిని కూడా అరెస్ట్ చేస్తారన్న వదంతులు గుప్పుమంటున్నాయి. ఈనేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం అటు పార్టీలో, ఇటు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఎంత ఉంది.. ? అసలు ఉందా.. ? లేదా.. ? అన్న విషయాలను పక్కన పెడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు ఎన్ని సక్సెస్ అవుతున్నాయన్నదే అసలు ప్రశ్న. అయితే.. ఈడీ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ శిక్ష పడిన దాఖలాలు కూడా లేవన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. మరోపక్క గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతే కవితను అరెస్ట్ చేయవచ్చు అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఈనెల 6వ తేదీ తర్వాత ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.