- నియోజకవర్గంలో బీజేపీ అగ్రనేతల ప్రచారం..
- రేపు హన్మకొండకు జనసేన అధినేత పవన్ కల్యాణ్
- రావు పద్మకు మద్దతుగా భారీ బహిరంగ సభ..
- వరంగల్, హన్మకొండల్లో పవర్ స్టార్ రోడ్ షో..!
- బీజేపీ శ్రేణుల్లో నయా జోష్..
అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ పశ్చిమలో కమలదళం దూకుడు మరింత పెంచింది. బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి రావు పద్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో అన్ని వర్గాల మద్దతు కూడగడుతూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే హైకమాండ్ వరంగల్ పశ్చిమపై ఫోకస్ మరింత పెంచింది. ఉమ్మడి జిల్లాలో గెలిచే అవకాశాలున్న స్థానంగా భావిస్తున్న పశ్చిమ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన అధిష్టానం అందుకనుగణంగా వ్యూహాలు పన్నుతోంది. ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్య నేతలను నియోజవర్గంలో ప్రచారంలోకి దింపుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖిలా వరంగల్లో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈనెల 18న సకల జనుల విజయ సంకల్ప సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈనెల 22న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని సీఎస్సార్ గార్డెన్ వద్ద పవన్ సభ కోసం బీజేపీ నేతలు భారాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్, హన్మకొండల్లో పవర్ స్టార్ రోడ్ షో నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
సభకు భారీ ఏర్పాట్లు…
తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారంలోకి దిగుతున్నారు. ఈనెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మగౌరవ సభలో మోడీతో కలిసి పాల్గొ న్నారు. తాజాగా బుధవారం (రేపు) వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మ ద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. అగ్రనేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తుండడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. పవన్కు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులతోపాటు జనసైనికులు, పవన్ అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని సీఎస్సార్ గార్డెన్ పక్కన ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో వపన్ ప్రసంగించనున్నారు. ఈమేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ పర్య టన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
జోరు పెంచిన రావు పద్మ..
వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఆడబిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వరంగల్ మహానగరంలో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన రావు పద్మ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంటింటికీ బీజేపీ పేరుతో వరంగల్ పశ్చిమ నియో జకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రధాని మోడీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరోనా, వరంగల్ వరదల సమయంలో నగర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొన్ననే అగ్రనేత అమిత్ షా పర్యటనతో మంచి జోష్ మీదున్న బీజేపీ శ్రేణులు.. రేపు పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తుండటంతో ఖుషీ అవుతున్నారు.