- ప్రచారంలో దూసుకుపోతున్న
కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు - ప్రజా దీవెన యాత్రకు జనం బ్రహ్మరథం
- అధికార పార్టీ నుంచి కొనసాగుతున్న చేరికలు
- కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..
- డీలాపడుతున్న గులాబీ దళం
- బీటలువారుతున్న బీఆర్ఎస్ కంచుకోట..?
అక్షరశక్తి, వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోందా..? హస్తం పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు నియోజకవర్గంలో లభిస్తున్న ఆదరణే ఇందుకు సంకేతమా..? 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరుగులేని విజయం సాధించిన అరూరి రమేష్కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదా..? అంటే.. నియోజకవర్గంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. ప్రజల నుంచి రోజురోజుకు నాగరాజుకు పెరుగుతున్న మద్దతుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీస్తున్న కాంగ్రెస్ గాలి తోడవటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్న టాక్ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. మరోపక్క.. ఎమ్మెల్యే అరూరి రమేష్ తీరుతో రగిలిపోతున్న ఆయన అనుచరులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్లోకి క్యూకడుతున్నారు. దీంతో గులాబీ దళం పూర్తిగా డీలాపడుతుండగా, హస్తం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యే రమేష్పై నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కాంగ్రెస్కు కలిసివస్తాయని ఆపార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు గెలుపునకు బాటలు వేస్తాయని శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు తప్పవనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు..
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేష్ ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే.. రెండోసారి గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే రమేష్ తీరుతో సొంత పార్టీ నేతలతోపాటు ప్రజలు విసిగిపోయారన్న వాదన ఉంది. అంతేగాక నియోజకవర్గానికి అరూరి చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో కొందరు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. పార్టీలో ఉన్నవాళ్లూ ఎమ్మెల్యే రమేష్కు పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితులు లేవనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో పార్టీలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ వాతావరణాన్ని అరూరి రమేష్ ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నియోజకవర్గంలో మారిన పరిస్థితులు, పరిణామాలన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
నాగరాజుకు పెరుగుతున్న మద్దతు..
వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామగ్రామాన అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండగా, ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని నాగరాజు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు మరిచి ఇప్పుడు ఇంకేదో సాధిస్తామంటూ చెప్పుకుంటున్న అరూరి రమేష్పై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని నాగరాజు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు తోడు పార్టీ మేనిఫెస్టో గ్రామాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు ఆయా వర్గాలను ఆకట్టుకుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ నాగరాజుకు ఎన్నికల్లో సానుకూలంగా మారుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.