- బీజేపీ ఫ్లెక్సీలను దహనం చేసిన బీఆర్ఎస్వీ నేతలు
- 11 మంది విద్యార్థి నాయకుల అరెస్ట్… ధర్మసాగర్ పీఎస్కు తరలింపు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు.ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు యత్నించారు. ఈక్రమంలో దీంతో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది.
కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో 11 మంది నిరసనకారులను పోలీసులు ఆరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఈరోజు సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ లక్ష చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్పంప్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ.. దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది.