- కొట్టుకుంటున్న విద్యార్థినులు
- స్పెషలాఫీసర్ పర్యవేక్షణ కరువు
- ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం
- ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వని వైనం
- ఏకపక్షంగా పదో తరగతి విద్యార్థినికి టీసీ
- అధ్వానంగా బ్రాహ్మణపల్లి కస్తర్బాగాంధీ గురుకుల బాలికల విద్యాలయం నిర్వహణ
అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయం నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. స్పెషలాఫీసర్ పట్టింపులేనితనంతో, పలువురు ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మెనూ పాటిస్తున్నారా? లేదా..?, పిల్లలు చదువుతున్నారా..? లేదా..? తరగతుల నిర్వహణ ఎలా ఉందో..? నిరంతరం తెలుసుకుంటూ పర్యవేక్షిస్తూ విద్యార్థినుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన స్పెషలాఫీసర్, ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల వ్యవధిలోనే విద్యాలయంలో పలు ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక విద్యార్థిని ఏకంగా విద్యాలయ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మొన్నటికి మొన్న ఇద్దరు విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఘర్షణపడినట్లు తెలుస్తోంది. పదో తరగతి విద్యార్థిని.. ఏడో తరగతి బాలికను కొట్టడంతో గాయపడడం, ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా గొడవపడడం.. ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా స్పెషలాఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి.
ఎస్వో ఇష్టారాజ్యం…
కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయం స్పెషలాఫీసర్ వసంత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 25న రాత్రి ఏడో తరగతి విద్యార్థినిని పదో తరగతి విద్యార్థిని కొట్టిన విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చెప్పకుండా కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. స్పెషలాఫీరస్ వ్యవహార శైలితో ఏకంగా ఇద్దరు విద్యార్థినుల తరుపువారు కూడా గొడవపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాకుండా, పదో తరగతి విద్యార్థినిని ఏకంగా టీసీ ఇచ్చి విద్యాలయం నుంచి పంపించడంపై తీవ్ర విమర్శలు వచ్చిపడుతున్నాయి. విద్యార్థినుల కదలికలను, ప్రవర్తనను నిరంతరం పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ వారిని సన్మార్గంలో నడిపించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వారే ఏకపక్షంగా వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ వైపు డ్రాపౌట్స్ను తగ్గించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న విద్యాలయం నుంచే విద్యార్థినికి టీసీ ఇచ్చి పంపిండం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఇదంతా కూడా కేవలం స్పెషలాఫీసర్, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు..
కస్తూర్బాగాంధీ గురుకుల బాలికల విద్యాలయాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే స్పెషలాఫీసర్లు, ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో మెజార్టీగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవర్గాల బాలికలే చదువుకుంటున్నారు. ఆ పిల్లలు చదువులో రాణించి, జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేలా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, స్పెషలాఫీర్లు, ఉపాధ్యాయులపై ఉంది. కానీ.. వారు దానిని గుర్తించకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో విద్యాలయాల నిర్వహణ దయనీయంగా మారుతోంది. ఇప్పటికైనా, ఉన్నతాధికారులు స్పందించి, నిరంతర పర్యవేక్షణతో విద్యాలయాల నిర్వహణను ఉన్నత స్థితికి తీసుకురావాలని బాలికల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.