- నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ
- కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై వీడని సస్పెన్స్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలు..
- ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు
- టికెట్ రేసులో రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్, భూపాల్నాయక్
- తుది దశకు చర్చలు.. రెండు మూడు రోజుల్లో ప్రకటన
- రంగంలోకి ఆర్ఎస్.. పొంగులేటి..?
- అక్షరశక్తి, వరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు శుక్రవారంరాత్రి కాంగ్రెస్పార్టీ విడుదల చేసింది. ఇందులో 45 మంది అభ్యర్థులకు అవకాశం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలకుగాను 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే.. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న డోర్నకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావహులతోపాటు సాధారణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం డోర్నకల్ను మాత్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇటీవలి కాలంలో డోర్నకల్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్ బలంపుంజుకుంది.
అంతేకాదు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలిచే సీటుగా హైకమాండ్ డోర్నకల్ను భావిస్తోంది. ఈక్రమంలోనే అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్కు ధీటైన అభ్యర్థిని పోటీకి దింపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎందుకీ జాప్యం..
డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో పెట్టడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా డాక్టర్ రాంచంద్రనాయక్, మాలోతు నెహ్రూనాయక్, భూపాల్ నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే రాంచంద్రనాయక్, నెహ్రూనాయక్తో అధిష్టానం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసిన జాబితాలో డోర్నకల్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎంపీ, ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి,
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ కురువృద్ధుడు రామసహాయం సురేందర్రెడ్డి ప్రభావం ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో కీలక నేతలు ఎవరైనా డోర్నకల్పై కన్నేశారా అన్న అనుమానాలు కలుగు తున్నాయి. వాళ్ల కోసమే డోర్నకల్ సీట్ను పెండింగ్లో పెడుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. పరకాల మాదిరిగానే అనూహ్యంగా ఏ నేత కోసమైనా వేచి చూసే ధోరణితో డోర్నకల్ సీటును రిజర్వ్లో ఉంచారా అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.