Saturday, July 27, 2024

రాళ్ల‌కు త‌ల‌వంచిన తూటాలు

Must Read

మానుకోట ఘ‌ట‌న‌కు నేటితో 13 ఏళ్లు

ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్ర‌జ‌ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గ‌ట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడ్డాయి. సమైక్య పాలకుల‌ను పరుగులు పెట్టించాయి. పోలీసుల బుల్లెట్ల‌కు భ‌య‌ప‌డ‌ని మానుకోట ప్ర‌జ‌ల వీరోచిత పోరాటం.. మలి ద‌శ ఉద్య‌మాన్ని మ‌లుపుతిప్పింది. యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించింది. ఇక్క‌డి యువత చిందించిన రక్తం, గర్జించిన సమైక్య పిస్టళ్లకు కంకరరాళ్లతో ఎదురొడ్డిన తెలంగాణవాదుల అస మాన గుండె ధైర్యం వెరసి తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తెలంగాణ సాధన ప్రక్రియలో వెనకడుగు వేయబోమని, ప్రాణాలైనా అర్పించి రాష్ట్రం సాధించుకుటామనే సంకేతాలనిచ్చింది మానుకోట ఘటన. మానుకోట రాళ్ల‌దాడి ఘటనకు నేటితో పదమూడేళ్లు.
అస‌లేం జ‌రిగింది..
2010 మే 16న నాటి కాంగ్రెస్ నేత‌, ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌ ఓదార్పు యాత్ర‌ పేర మానుకోట ద్వారా తెలంగాణలో కాలుమోపుతామని ప్రకటన చేశారు. పార్లమెంటులో సమైక్య ప్లకార్డు ప్రదర్శించిన జగన్‌ను తెలంగాణలోకి కాలు మోపనివ్వమని తెలంగాణ స‌మాజం ప్ర‌తిన‌బూనింది. రాజకీయ జేఏసీతో పాటు టీఆర్‌ఎస్‌, న్యూడెమోక్రసీ, ఓయూ, కేయూ, న్యాయవాద జేఏసీలు జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని ప్రకటించాయి. అనంతరం 17న జగన్‌ దిష్టిబొమ్మల దహనంతో ఆరంభమైన ఉద్యమం 27 వరకు తీవ్రస్థాయికి చేరుకుంది. అధికార బలంతో ఉన్న సీమాంధ్ర పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం కుట్ర చేస్తున్నారన్న సమాచారంతో యువకులు ఓదార్పు యా త్రను అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. ఇంటెలిజెన్స్ నివేదికలను సైతం పట్టించుకోని నాటి కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు అధికార బలంతో యాత్రకు బ‌య‌లుదేరారు. దీంతో మానుకోట రైల్వే స్టేషన్‌ సమైక్యవాదులు – తెలంగాణ వాదుల మధ్య సమరానికి వేదికగా మారింది.
2010 మే 28 టెన్షన్‌.. టెన్షన్‌..
మానుకోటకు రైల్లో జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న స‌మాచారంతో యువ‌కులు, వివిధ పార్టీల నాయ‌కులు వేలాదిగా స్టేష‌న్‌ను చుట్టుముట్టారు. వెయిటింగ్ రూంలో అంగరక్షకులతో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులకు తెలంగాణవాదుల నిరసన సెగలు తాకాయి. జై తెలంగాణ నినాదాలతో మానుకోట ప‌ట్ట‌ణం మార్మోగింది. ఉద్యమకారుల హోరును తట్టుకోలేకపోయిన సమైక్యవాదులు వాళ్ల‌ను రెచ్చగొట్టారు. బయట పట్టణంలో చుట్టుపక్కల‌ నియోజకవర్గాల నుంచి తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చిన ప్రజలు ఇసుకవేస్తే రాలని తరహాలో వీధుల్లో నిండిపోయారు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూం నుంచి పిస్టల్స్‌ నిప్పులు కక్కాయి. కాంగ్రెస్‌ నేతల అనుచరులు సైతం కట్టెలు, రాళ్లతో తెలంగాణవాదులపైకి దాడికి తెగ‌బ‌డ్డారు. తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. పిస్టల్‌ గుళ్లకు ఎదురొడ్డుతూ రైల్వే లైన్‌పై ఉన్న కంకరరాళ్లనే తూటాలుగా మలుచుకుని ఎదురుదాడికి దిగారు. ప‌ట్టాల మ‌ధ్య‌లో ఉం డాల్సిన రాళ్లు ప‌ట్ట‌ణంలోకి వ‌చ్చాయి. దీంతో మానుకోట మొత్తం రణరంగాన్ని తల‌పించింది. పరస్పర దా డుల్లో అంగరక్షకుల కాల్పులకు 15 మంది తెలంగాణవాదులు, రాళ్ల దెబ్బలతో 25 మంది గాయపడ్డారు. ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్ప‌డంతో వంగ‌ప‌ల్లి స్టేష‌న్‌లోనే రైలును ఆపి వైఎస్ జ‌గ‌న్‌ను పోలీసులు బ ల‌వంతంగా హైద‌రాబాద్ త‌ర‌లించారు.
మ‌హిమ‌గ‌ల రాళ్లు..
మానుకోటలో సమైక్యవాదుల అంగరక్షకుల పిస్టల్‌ తూటాలకు బ‌దులిచ్చిన రైల్వే స్టేషన్‌లో ఉన్న కంకర రాళ్లను యావత్‌ తెలంగాణ మహిమగల రాళ్లుగా కీర్తించింది. కళ్లకు అద్దుకుని ముద్దాడింది. మానుకోట రైల్వే స్టేషన్‌ రాళ్లకు పూజలు నిర్వహించి అతిపవిత్రంగా తీసుకువెళ్లి వ‌రంగ‌ల్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించుకున్నారు. ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అనేక వేదికలపై ‘ఎప్పుడైనా ధైర్యం సన్నగిల్లినప్పుడు, ఉద్యమం వెనక్కి తగ్గుతుంది అన్పించినప్పుడు మానుకోట రాళ్లను గుర్తుకు తెచ్చుకోండి, ఒక్కసారి వాటిని కళ్లకు అద్దుకుని హృదయానికి తాకించుకోండి. ఆ వెంటనే ఎక్కడ లేని ఉద్యమ స్ఫూర్తి, ధైర్యం మిమ్మల్ని ఉత్తేజ పరుస్తుంది’ అంటూ కితాబిచ్చాడు.
కేసీఆర్ ప‌రామ‌ర్శ‌..
సమైక్య పాలకుల తుపాకీ తూటాలకు గాయాల‌పాలైన ఉద్య‌మ‌కారుల‌ను అప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఉద్యమ‌ సారధి కేసీఆర్ క్షతగాత్రులను పరామర్శించారు. ఒక్కొక్కరికీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గాయపడ్డ ప్రతి ఒక్కరికీ ఇంటికో ఉద్యోగంతోపాటు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూం అందిస్తానని హామీ ఇచ్చారు. మానుకోట రాళ్ల దాడితో సమైక్య వలస పాలకులను తరిమికొట్టి సరిగ్గా పదమూడేళ్లు అవుతుండ‌గా నాటి జ్ఞా న‌ప‌కాల‌ను ఉద్య‌మ‌కారులు గుర్తు తెచ్చుకుంటున్నారు. మానుకోట రాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచాయి. పుస్తకాలుగా ఆవిష్కృతమయ్యాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img